పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
జీ న్యూస్ హుజూరాబాద్
మూడవ చివరి విడతలో నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను ఎటువంటి సమస్యలకు తావివ్వకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు-2025లో భాగంగా కరీంనగర్ జిల్లాలో 17న చివరి విడత పోలింగ్ జరగనున్నాయి. హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్ మండలాల్లోని గ్రామపంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. హుజురాబాద్ మండలానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కాలేజిలో, జమ్మికుంట మండలానికి సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో, ఇల్లందకుంట మండలానికి సంబంధించి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ఫంక్షన్ హాల్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

ఈ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం సందర్శించి, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని కౌంటర్ల ను, ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో ఆమె మాట్లాడారు. ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని , ఏవైనా సమస్యలు ఉంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు జిల్లాకేంద్రానికి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని, చివరి దశ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ రమేష్ బాబు, సిబ్బంది ఉన్నారు.

