వెన్నంపల్లి, సైదాపూర్ పిఏసీఎస్ ప్రత్యేక అధికారిగా ముంజాల శ్రీనివాస్
జీ న్యూస్ సైదాపూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం మేరకు, వెన్నంపల్లి, సైదాపూర్ సొసైటీల ప్రత్యేక అధికారిగా సహకార సంఘాల సీనియర్ ఇన్స్పెక్టర్ ఆడిటర్ ముంజాల శ్రీనివాస్ గౌడ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పిఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, పాలక వర్గాల పదవీ కాలం గత ఆగస్టు 14వ తేదీతో ముగిసింది. అప్పటి నుండి పాత పాలక వర్గాలనే కొనసాగించిన ప్రభుత్వం, తాజాగా అన్ని డీసీసీబీల చైర్మన్లను, పాలక వర్గాలను రద్దు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు హైదరాబాద్ రిజిస్ట్రార్ కె. సురేందర్ మోహన్ జారీ చేసిన ఆదేశాలతో ముంజాల శ్రీనివాస్ను సైదాపూర్, వెన్నంపల్లి సొసైటీలకు ప్రత్యేక అధికారిగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సైదాపూర్, వెన్నంపల్లి పిఏసీఎస్ సెంటర్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను సిబ్బంది ఘనంగా స్వగతం పలికారు. కార్యాలయ రికార్డులను పరిశీలించి, సిబ్బందితో సమావేశమయ్యారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని పారదర్శకతతో విధులు నిర్వహించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. తదుపరి ఎన్నికలు నిర్వహించి కొత్త పాలక వర్గం కొలువుదీరే వరకు ఈ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.

