టీచర్ల టెట్ పరీక్షను రద్దు చేయాలి!
పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేయాలి!!
—టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి
జీన్యూస్ పరకాల
సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ పెన్షన్ పథకం రద్దు చేసి ఉద్యోగుల భద్రతకోసం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నడికుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నభోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనలో టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేష్ లు మాట్లాడుతూ ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని దేశవ్యాప్తంగా టీచర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమికోపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని, అశాస్త్రీయమైన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పాఠశాలల విలీనం, మూసివేతను ఆపివేసి అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందించే కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శన లో ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు, కృపమ్మ, శ్రావణ్ కుమార్, పోరిక రాజు, శివకుమార్ , శ్రీనివాస్ రెడ్డి, సుభాని, సుమలత, శారద, జ్యోత్స్న , రవిందర్ తదితరులు పాల్గొన్నారు.
