టూరిస్టు కేటీఆర్ తెలంగాణ ద్రోహి
జీ న్యూస్ హుజూరాబాద్
టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఉద్యమకారుడైన కేకే మహేందర్ రెడ్డిని ధగా చేసి అమెరికా నుండి ప్యారచూట్లో వాలిన టూరిస్ట్ రామారావుగా ఆంధ్రా వాళ్ళ దోపిడీని మించి ఉద్యమకారుడి కంచాన్ని గుంజుకున్న తెలంగాణ ద్రోహి అని రాజన్న సిరిసిల్లా జిల్లా డీసీసీ సెక్రటరీ బాలసాని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సిరిసిల్ల శాసన సభ్యుడు, మాజీ మంత్రి కేటీఆర్ సర్పంచుల ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు కేటీఆర్ అహంకారానికి, అజ్ఞానానికి పరాకాష్ఠ అని ఆయన విమర్శించారు. నాలుగు సార్లు ఓటమి చెందినా ఆది శ్రీనివాస్ మొక్కవోని ధైర్యంతో ప్రజలే ప్రాణంగా అలుపెరుగని పోరాటం చేశారే తప్ప, కేటీఆర్ నాయకుడి మాదిరిగా ఫామ్హౌస్లో అలకపాన్పు ఎక్కలేదని ఎద్దేవా చేశారు. నాలుగు సార్లు ఓటమి విషయానికొస్తే, మీలాంటి గడీల గుంట నక్కల నీతిమాలిన రాజకీయాల వల్లే ఇది జరిగిందన్నారు.
వేములవాడ ఎమ్మెల్యేగా దొంగ పాస్పోర్టులతో ఆది శ్రీనివాస్ కంచాన్ని గుంజుకున్నది జర్మన్ బాబు దేశద్రోహి కాదా అని ప్రశ్నించారు. మీలాంటి గడీల గజదొంగల వల్లనే ఇద్దరు ప్రజా నాయకులకు అన్యాయం జరిగిందన్నది వాస్తవమన్నారు. సానుభూతితో కాదని, ఆది శ్రీనివాస్ సాహసాన్ని చూసి ప్రజలు ఓట్లు వేశారని, ఇది కేటీఆర్ మట్టి బుర్రకు వెయ్యి జన్మలెత్తినా అర్థం కాదని ఎద్దేవా చేశారు. ఇక కేటీఆర్ సర్పంచుల ఆత్మీయ సమావేశం గురించి ప్రస్తావిస్తూ, ప్రజా పాలనలో ఎన్నికైన సర్పంచుల సమ్మేళనం కన్నా ముందు, పంచాయతీ రాజ్ మంత్రిగా మీరు బిల్లులు చెల్లించక చంపిన 150 మంది సర్పంచుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి క్షమాపణలు కోరి ఉంటే బాగుండేదన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు జాడించి తంతే వచ్చి మిడ్ మానేర్లో పడ్డా కూడా బుద్ధి రాకపోవడం బాధాకరమన్నారు. రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ సీన్ సిరిసిల్లలో కూడా రిపీట్ కావడం, కేటీఆర్ కూడా ఫామ్హౌస్లో బందీ కావడం తథ్యం అని జోస్యం చెప్పారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
