ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తో యూరియా సమస్యలకు చెక్
మండల వ్యవసాయ అధికారి పోరిక జై సింగ్
జీ న్యూస్ నడికుడ
కొత్తగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తో రైతులు యూరియ బస్తాల కొరత సమస్య ఉండదని
మండల వ్యవసాయ అధికారి పోరిక జై సింగ్ తెలిపారు. దీనిక సంబందించిన వివరాలను ఆయన శుక్రవారం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాబోవు యాసంగి పంట కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను సరఫరా చేయాలనే ఉద్దేశంతో “ఫర్టిలైజర్ బుకింగ్ యాప్” ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రేపు అనగా తేదీ: 20.12.2025 నుండి ఈ యాప్ లో రైతులు తమ మొబైల్ నెంబర్ ను ఉపయోగించి ఓటిపి ద్వారా లాగిన్ కావాలని, తర్వాత జిల్లాను ఎంచుకుంటే వివిధ సొసైటీలు లేదా డీలర్ల వద్ద ఉన్న స్టాక్ వివరాలు కనిపిస్తాయన్నారు. తమకు అనుకూలమైన మరియు అందుబాటులో ఉన్న సొసైటీలు లేదా డీలర్ వద్ద యూరియా బస్తాల కోసం “స్లాట్ బుకింగ్”చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ చేసే క్రమంలో పంట సీజను,పట్టా పాస్ బుక్ నెంబరు,ఏ పంట ఎంత విస్తీర్ణం, పంట రకము నమోదు చేసుకోవాలన్నారు. పంట విస్తీర్ణాన్ని బట్టి యూరియా బస్తాలు తీసుకోవచ్చని, రైతుల బుకింగు కు 24 గంటల వ్యవధి ఉంటుందని వెల్లడించారు. ఈ స్మార్ట్ యూరియా బుకింగ్ విధానంలో ఒక ఎకరం వరకు ఒకేసారి ఒకటి నుండి 5 ఎకరాల వరకు 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఐదు నుండి 20 ఎకరాల వరకు మూడు సార్లు 15 రోజుల వ్యవధిలో బుక్ చేసుకోవచ్చన్నారు. పాసుబుక్ లేని రైతులు ఆధార్ నెంబర్ ద్వారా యూరియా బస్తాలను పొందవచ్చని, కౌలు రైతులను కూడా ఈ యాప్ లో అవకాశం కల్పించారన్నారు.
డీలర్లు కూడా మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి రోజువారి స్టాకు అమ్మకం వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని రైతు సోదర సోదరీమణులు తప్పని సరిగా తెలసుకోవాలని, గతం లో మాదిరిగా సాధారణ పద్ధతిలో యూరియా బస్తాలు అందించబడదని స్పష్టం చేశారు. గూగుల్ ప్లే స్టోర్లో “ఫర్టిలైజర్ బుకింగ్ యాప్” ను డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా స్లాట్ బుక్ చేసుకొని యూరియా బస్తాలను పొందాలన్నారు. ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్న సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా సంప్రదించవచ్చన్నారు.
